గణితం పరీక్ష భయంతో.....డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
G. ఉపేందర్, ఎస్సై, తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు సెంటర్:-
మ్యాథ్స్ (గణితం) పరీక్ష రాయడం ఇష్టం లేక, ఆందోళనతో ఓ డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గోరి కొత్తపల్లి గ్రామానికి చెందిన రాచర్ల దేవేందర్ కుమారుడు రాచర్ల కార్తీక్ (20), తొర్రూరు మండలంలోని నాంచారి మడూర్ గ్రామ పరిధిలో గల మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల (MJPTBCWR) డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో, హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో కార్తీక్ తన బెడ్డుపై టవల్తో ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి చూసేసరికే కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు.
కారణం అదేనా?
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడికి గణితం (Maths) అంటే మొదటి నుంచీ ఇష్టం లేదు. సోమవారం (రేపు) ఉదయం గణితం పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్ష రాయడం ఇష్టం లేకనో, లేదా ఆ సబ్జెక్టుపై ఉన్న భయం వల్లనో మనస్తాపానికి గురై కార్తీక్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.
"తన కుమారుడికి మ్యాథ్స్ చదవడం ఇష్టం లేదని, రేపు జరగబోయే పరీక్ష రాయడం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు.
మృతుడి తండ్రి దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొర్రూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఎస్సై ఉపెందర్ తెలిపారు.
చేతికి అందొచ్చిన కొడుకు కళ్లముందే శవమై పడి ఉండటంతో తండ్రి దేవేందర్, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comment List