క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
మునిసిపాలిటీలకు పట్టిన 'మసి'. ఎంఆర్ఓ కార్యాలయాల ‘మతి లేని’ పనులు. నీటిపారుదల శాఖ ‘నమూనా,నక్షలు’. విద్యాశాఖ వింత వ్యాపారాలు. వైద్యశాఖ కు పట్టిన పైత్యం. పలు శాఖలకు పట్టి పీడిస్తున్న 'అవినీతి గ్రహణం'.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గ పదవి బాధ్యతలు తీసుకొన్న క్రొత్త కలెక్టర్ ప్రావీణ్య కు తలకు మించిన భారంగా సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి అనడం అతిశయోక్తి కాకపోవచ్చు! తేదీ 13, జూన్ శుక్రవారం నాడు సంగారెడ్డి ఐ బి గెస్ట్ హౌస్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్ డి ఓ రవీంధర్ రెడ్డి మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్ గా పి. ప్రావీణ్య, ఐఏఎస్, బాధ్యతలు స్వీకరించారు. 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారైన పి. ప్రావీణ్య గతంలో హనుమకొండ జిల్లా కలెక్టర్గా, అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, జిహెచ్ఎంసి అదనపు కమిషనర్గా అనేక పరిపాలనాత్మక బాధ్యతలు నిర్వహించారు. ఈ అనుభవంతో మునిసిపాలిటీలకు పట్టిన 'మసి' వదిలించే విధంగా కార్యక్రమాలు కొనసాగాలని, ఎంఆర్ఓ కార్యాలయాల ‘మతి లేని’ పనులు చేసే వారికీ స్థితిగతులు మార్చేవిధంగా సింహస్వప్నం కావాలని, చట్టాలను కాలరాసే కొంత మంది నీటిపారుదల శాఖ ఉద్యోగులకు ‘నమూనా,నక్షలు' మారిపోయే విదంగా చర్యలు చేపట్టాలని, విద్యార్థుల భవిష్యత్తు తో ‘తుచ్ఛమైన వ్యాపారం’ చేసే గురువుల రూపంలో విద్యాశాఖ వింత వ్యాపారాలకు అడ్డుకట్ట వెయ్యాలని, 'వైద్యో నారాయణో హరి' అనే స్ఫూర్తితో కొనసాగవలసిన వైద్య వృత్తిని కొందమంది రాక్షసరూపం దాల్చి 'వైద్యశాఖ కు పట్టిన పైత్యనికి' ఘాటైన చికిత్స చేస్తారని సంగారెడ్డి జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు శాఖలకు పట్టి పీడిస్తున్న 'అవినీతి గ్రహణాన్ని’ పారద్రోలాలని, క్రొత్త కలెక్టర్ గా ‘జిల్లా పరిపాలనాత్మక బాధ్యతల ప్రావీణ్యం' నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, జిల్లా ప్రజల మెప్పు పొందాలని, జిల్లా ప్రజలు కోరుకుంటారు.
Comment List