మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
కోడి పిల్లలను సజీవ దహనం?
కోడి పిల్లలను సజీవ దహనం?
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్, మార్చి 02, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మన్నెగూడలో ఎస్ఆర్ హ్యాచరీస్ యాజమాన్యం అమానుషంగా కోడి పిల్లలను సజీవంగా కాల్చివేస్తోందని పక్కపొలాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాచరీలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు, ప్లాస్టిక్ చెత్తను కూడా ఇష్టారీతిగా తగలబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పొలాల్లో వ్యవసాయ పనుల కోసం వెళ్లినప్పుడు వ్యర్థాల దహనం వల్ల వ్యాపించే దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగమంచు ముసురుకున్నట్లు పొగ కమ్మేసి పంటలకు కూడా నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా వ్యర్థాలను తగలబెట్టడం చట్ట విరుద్ధమని, వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఓ మాజీ ఎంపీకి చెందినదిగా ప్రచారం ఉండటంతో, స్థానికంగా ఎవరూ బహిరంగంగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదని గ్రామస్థులు అంటున్నారు. ప్రభావశీలుల సంస్థ కావడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పశుసంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్థలాన్ని పరిశీలించి, నిజానిజాలు తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comment List