ఐటీ సంస్థల హబ్ గా విశాఖ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సిటీలతో పోటీ
విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నంబర్-2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. అనంతరం ఇన్ఫోసిస్ ప్రతినిధులను, సిబ్బందిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతమని, ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి పెద్ద ఎత్తున అడుగులు పడ్డాయని, ఈ తరుణంలో రాష్ర్టంలోని అతి పెద్ద నగరం, పరిపాలనా రాజధాని విశాఖలో ఇన్ఫోసిస్ డేటా సెంటర్ ప్రారంభించుకోవడం హర్షణీయమని సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్ నెంబరు 2 వద్ద నిర్మించిన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, యూజియా స్టెరిల్స్ ప్రెవేట్ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ, లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రేవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ సంస్థలను సీఎం జగన్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు నిలంజన్ రాయ్ (చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్), నీలాద్రిప్రసాద్ మిశ్రా (వైస్ ప్రెసిడెంట్)లతో కలిసి ఇన్ఫోసిస్ కాన్ఫరెన్స్ హాలులో సీఎం జగన్ ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవంలో తాను భాగం అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉందని, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్గా మారబోతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆ స్ధాయిలో ఈ నగరానికి ప్రభుత్వ సహాకారం అందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్లో లేదని, ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖపట్నంలో ఏర్పాటు కాలేదన్నారు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం విశాఖలో ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు అయ్యాయని తెలిపారు. అప్పట్లో విశాఖపట్నానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న సీఎం జగన్ టైర్ 2 సిటీగా ఉన్న విశాఖకు టయర్ వన్ సిటీగా ఎదగడానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం అందిస్తుందన్నారు.
యూజియా స్టెరిల్స్ ప్రెవేట్ లిమిటెడ్, పరవాడ ఫార్మాసిటీ
ఫార్మా, బయెటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ. 300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిర్మించిన ఈ యూనిట్ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రేవేట్ లిమిటెడ్
యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిర్మించిన ఈ యూనిట్ను సీఎం ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది.
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్
అచ్యుతాపురం ఏపీసెజ్లో లారస్ ల్యాబ్స్ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్ను సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో పాటు లారస్ ల్యాబ్స్ నూతన పరిశ్రమకు కూడా భూమి పూజ చేశారు.
Comment List