గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
*మహబూబాబాద్ జిల్లా:*
*తొర్రూరు సెంటర్:*
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి రహిత సమాజం లక్ష్యంగా పోలీసులు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు. గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, తొర్రూరు డీఎస్పీ సూచనలతో, సీఐ ఆధ్వర్యంలో తొర్రూరు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
తొర్రూరు పట్టణంలోని మారుమూల ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంజాయి నిల్వ, రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరించడంతో పాటు, ప్రజలకు గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

Comment List