గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
తులస్య తండాలో తెల్లవారుజామున దాడులు – 20 లీటర్ల గుడుంబా స్వాధీనం
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
తులస్య తండాలో తెల్లవారుజామున దాడులు – 20 లీటర్ల గుడుంబా స్వాధీనం
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు:
తొర్రూరు మండల పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొద్ది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై వరుసగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా ఆదివారం తులస్య తండాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఎస్సై మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నిర్వహించిన ఈ దాడుల్లో గుడుంబా తయారీకి సంబంధించిన స్థావరాలను గుర్తించారు. దాడుల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా.. సుమారు 300 లీటర్ల బెల్లం, చక్కెర మాష్ను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీలో పాల్గొన్న ముగ్గురిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల్లో అవగాహనకు పోలీసుల ప్రాధాన్యం
కేవలం దాడులతోనే కాకుండా.. గుడుంబా, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గుడుంబా సేవించడం వల్ల కుటుంబాలపై పడే ఆర్థిక, సామాజిక ప్రభావాలను వివరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి
గుడుంబా తయారీ, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై మహేందర్ రెడ్డి కోరారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తొర్రూరు మండలంలో గుడుంబా నిర్మూలనకు పోలీసులు వరుస దాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ గుడుంబా తయారీదారుల్లో ఆందోళన మొదలైంది. గుడుంబా, డ్రగ్స్కు చెక్ పెట్టే వరకు తమ చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Comment List