తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మిత్రుడికి తోడుగా: '2007 బ్యాచ్' పోలీసుల ఉదారత!
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి ) జులై 27 :విధి నిర్వహణలోనే కాకుండా తోటి ఉద్యోగి కష్టంలోనూ తామున్నామంటూ 2007 విడత (బ్యాచ్) ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. టేకులపల్లి మండలం, కుంటల గ్రామానికి చెందిన తొలం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా ఏఆర్ కానిస్టేబుల్గా సేవలందిస్తూ, నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలతో అకస్మాత్తుగా కన్నుమూశారు.ఈ విషాద వార్త తెలుసుకున్న ఆయన సహచరులు, 2007 విడతకు చెందిన తోటి కానిస్టేబుళ్లు వెంటనే స్పందించారు. నాగేశ్వరరావు కుటుంబానికి బాసటగా నిలవాలనే సంకల్పంతో తమ విడత సభ్యులందరి నుండి విరాళాలు సేకరించి, ₹1,49,000/- (లక్షా నలభై తొమ్మిది వేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.ఈ సందర్భంగా తోటి మిత్రులు మాట్లాడుతూ... "నాగేశ్వరరావు కర్తవ్య నిష్ట కలిగిన పోలీసు అధికారి మాత్రమే కాకుండా మంచి మనసున్న వ్యక్తి. ఆయన అకాల మరణం మా అందరికీ తీరని లోటు. ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ ఆయన లోటును పూర్చలేము, కానీ వారి కుటుంబానికి మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వడానికే ఈ చిన్న సహాయం చేశాం" అని భావోద్వేగంతో తెలిపారు.ఆపదలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన 2007 విడత మిత్రుల మానవతా దృక్పథాన్ని, బాధ్యతాయుతమైన ప్రవర్తనను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్థానికులు విశేషంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో 2007 విడత మిత్రులు ఎం. చంద్రశేఖర్, శామ్, లక్ష్మణ్ స్వామి, వెంకటేశ్వర్లు, రామారావు, రమేష్, గోపాల్, శేఖర్లతో కే. నాగరాజు, టీ. మధు మోహన్ ఇతర తోటి సిబ్బంది పాల్గొన్నారు.

Comment List