'కబ్జా డీల్' కు కోటిన్నర.!!!
కబ్జా దారుడికి జరిగిన లాభం ఎంత ? ఇరిగేషన్ అధికారులకు ఎంత ? మునిసిపల్ లో వున్నా 'ఆ' అధికారికి ఎంత ?
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 12, న్యూస్ ఇండియా : మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి కి ఇవ్వవలసిన కమిషన్ ఇవ్వకుండా కక్కుర్తి పడడం వలన విషయం బెడిసి కొట్టిందని తద్వారా బయటికి పొక్కి ఆ నోటా ఈ నోటా ‘పుకార్లు’ దావానంలా వ్యాపించినట్లు తెలిసింది. గతంలో తేదీ.23, ఏప్రిల్ మాసంలో'ఇరిగేషన్ శాఖ 'రెండు నాల్కల' ధోరణి.!' అనే శీర్షికతో ‘వార్తా’ ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సంగారెడ్డి పట్టణంలోని, గణపతి నగర్, కలెక్టరేట్ కార్యాలయానికి ముందు మురళీకృష్ణ ఆలయ మార్గంలో జరుగుతున్నా నిర్మాణం విషయంగా తెలిసింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పిర్యాదు నమోదు కాబడినది. విచారణ జరిగిన ప్రక్రియలో భాగంగా నాలా ధ్వంసం జరిగిన మాట నిజమే అని ‘నాలా’ను స్వయంగా పర్యవేక్షించిన ఇరిగేషన్ అధికారులు తేల్చిచెప్పారు. అది 'నాలా' కాదు.! అంటూనే.. నో అబ్ జేకేషన్ సర్టిఫికెట్ జారీ చేశామని స్వయంగా ఇరిగేషన్ శాఖ అధికారుల తీరు ఒక్కింత ఆశ్చర్యాన్ని కలిగించింది. 'నాలా' రీ-కన్స్ట్రక్షన్' కు ఎలాంటి అనుమతులు మంజూరి ఇవ్వలేదని సంబంధిత అధికారులు కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా... కబ్జాదారుడు, ఇరిగేషన్, మునిసిపల్ శాఖ లోని కొంతమంది కలసి ఈ 'కబ్జా డీల్' కు కోటిన్నర తుది ఒప్పందం జరిగిందని గణేశనగర్ కాలనీ వాసులు కొందరు బహిరంగంగానే మాట్లాడుకొంటున్నారు. అందులో భాగంగానే, కబ్జా దారుడికి ఒక వాటా లాభం పొందే విధంగా, ఇరిగేషన్ అధికారులకు రెండొవ వాటా మూల్యం చెల్లించే విధంగా, మున్సిపల్ లో వున్న 'ఆ' అధికారికి మూడవ వాటా మూల్యం ముట్ట చెప్పే విధంగా అవగాహన కు వచ్చి, పరస్పర మౌఖిక ఒప్పందం చేసుకొని ముచ్చటగా పంచుకున్నారని తద్వారా మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తికీ మొండిచేయి చూపించడం వలన ఈ విషయం బయటికి పొక్కి ఆ నోటా ఈ నోటా ‘పుకార్లు’ దావానంలా వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ నిర్మాణం జరుగుతున్నా స్థలాన్ని సందర్శించి పరీక్షించినట్టైతే 'పుకార్లు' నిజమే కాబోలు! అన్నట్టుగా 'నాలా కబ్జా' కండ్లకు కట్టినట్టు కనిపిస్తు దర్శనమిస్తుంది. ఈ 'నాలా కబ్జా' విషయంలో జిల్లా కలెక్టర్ కల్పించుకొంటె తప్ప పరిష్కారం లభించదని కాలనీ వాసులు అంటున్నారు.
Comment List